కొండ సురేఖ పొలిటికల్ ఎపిసోడ్ ఇప్పుడు బిట్ డిస్కషన్ గా మారింది.కాంగ్రెస్లోనే ఉంటారా.. ?సంచలన నిర్ణయం తీసుకుంటారా? అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. మంత్రి కొండ సురేఖ, ఆమె కుటుంబం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, మొత్తం రాష్ట్ర పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. “ఆమె కాంగ్రెస్లోనే కొనసాగుతారా? లేదా రాజీనామా చేసి బయటకు వస్తారా?” అన్న ప్రశ్న ఇప్పుడు వరంగల్ రాజకీయం నుండి గాంధీ భవన్ వర్గాల వరకు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
సొంత నియోజకవర్గం నుంచి గాంధీ భవన్ వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొ న్నాయి.కొండ మురళి, కొండ సురేఖ జంట ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు. అయితే, గత కొంతకాలంగా ప్రభుత్వం, సొంత పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలతో మొదలైన విభేదాలు ఇప్పుడు పీక్స్ కి చేరాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వివాదాలకు తెర లేపారని చర్చ ఉన్నది. మరో వైపు కొండ దంపతుల తదుపరి అడుగు ఏంటో తెలియక క్షేత్రస్థాయిలోని సొంత క్యాడర్, అనుచరులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.ప్రభుత్వంపై , జిల్లా అంతర్గత రాజకీయాలపై కొండ వర్గం చూపుతున్న అసంతృప్తి మున్ముందు ఏ రూపం దాలుస్తుందోనని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు భయపడుతున్నాయి. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతారా? లేదా అంతకంటే ముందే సీఎం, పార్టీలోని కొందరు నేతలను విభేదించి బయటకు వచ్చేస్తారా అనేది సస్పెన్షన్ గా మారింది.
ఒకవేళ కొండ సురేఖ కాంగ్రెస్కు గుడ్ బై చెబితే ప్రత్యామ్నాయం ఏమిటనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి.బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? లేదా ఇతర పార్టీలను ఎంచుకుంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.గతంలో గులాబీ గూటికి వెళ్లి వచ్చిన నేపథ్యం ఉండటం, వరంగల్ ప్రాంతంలో బీఆర్ఎస్ కు బలమైన కేడర్ ఉండటంతో ఆ పార్టీ వైపు మళ్లీ వెళ్తారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన మాస్ లీడర్ల కోసం చూస్తోంది. కొండ కుటుంబంపై బీజేపీ అధిష్టానం కన్నేసిందనే వార్తలు వస్తున్నాయి. ఇక కొండ సురేఖ బయటకు వచ్చేస్తే అందరికంటే ముందు తామే ఆహ్వానించాలని కొన్ని బీసీ సంఘాల పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి.
అధిష్ఠానం వద్ద తమ ప్రాధాన్యతను పెంచుకోవడానికి, జిల్లా రాజకీయాల్లో చెక్ పెట్టడానికే కొండ సురేఖ ఈ రకమైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని మరో వర్గం వాదిస్తోంది.అయితే ఈ వివాదం మరింత పెద్దది కాకుండా ఉండేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది సస్పెన్స్గా మారింది.పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం ఎలాంటి హామీ ఇస్తారు, కొండ సురేఖ లేవనెత్తిన అంశాలను ఎలా పరిష్కరిస్తారు అనే అంశంపైనే ఈ ఎపిసోడ్ ముగింపు ఆధారపడి ఉంది. సీఎం జోక్యం చేసుకుని క్లారిటీ ఇస్తే తప్ప ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపించడం లేదు.ఏది ఏమైనా, రాబోయే కొద్ది రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలతో పాటు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. కొండ సురేఖ తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత సమతుల్యతను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.
ఇక మంత్రి కొండా సురేఖ వరుసగా ఈ వివాదాల్లో చిక్కుకోవడంలో కారణమవుతున్న ఆమె డాటర్ కొండ సుస్మిత జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన రాజకీయ నేతలుగా ఉన్న కొండ ఫ్యామిలీని పార్టీలోకి తీసుకుంటే జనసేన మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసంతృప్తితో ఉన్న కొండ ఫ్యామిలీని జనసేన టీం సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. కొండ ఫ్యామిలీ రాజకీయంగా ప్రతిపాదించే ప్రతిపాదనను జనసేన అంగీకరిస్తూనే, ఉమ్మడి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించే సూచనలు ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఉన్నట్లు తెలిసింది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల కొండ సుష్మిత వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అనంతరం ఇప్పటివరకు అధికారికంగా, మీడియా సమక్షంలో తమ రాజకీయ ప్రణాళిక పై ఎక్కడ ప్రకటించలేదు.








