ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులు, సంక్షోభంపై ఆమె తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, తనకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి పార్లమెంట్ వేదికగా ఏపీ రైతుల సమస్యలపై చర్చ చేపట్టాలని, వారిని ఆదుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనను చూసి అత్యంత ఆందోళనతోనే తాను ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె పేర్కొంటూ.. కూటమి ప్రభుత్వం ముందు 9 కీలక డిమాండ్లను ఉంచారు.
ఆక్వా రంగానికి అత్యవసర భరోసా
రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఆక్వా రైతుల మనుగడ, ఎగుమతులపై పార్లమెంట్ లో తక్షణమే చర్చ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు. రొయ్యల మేత టన్నుపై పడిన అదనపు భారం 30 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వమే భరించేలా 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ వెంటనే మంజూరు చేయించాలన్నారు. అలాగే, అంతర్జాతీయంగా రాష్ట్ర ఆక్వా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 30 శాతం సుంకాలను పూర్తిగా రద్దు చేయించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
పొగాకు, వాణిజ్య పంటల సంక్షోభం
రాష్ట్ర పొగాకు రైతుల కష్టాలకు కేంద్రం శాశ్వత పరిష్కారం చూపేలా పార్లమెంట్ లో గళమెత్తాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రైతుల దగ్గర పేరుకుపోయిన 230 మిలియన్ కిలోల పొగాకును కేంద్ర ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీటితో పాటు మొక్కజొన్న లాంటి ఇతర పంటల గిట్టుబాటు ధరలో ఏర్పడుతున్న నష్టాన్ని 100 శాతం కేంద్రమే భరించేలా ఒప్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యానవన పంటల రక్షణ, నిధుల సాధన
రాష్ట్రంలో పండే మామిడి పంటలకు కేంద్రం ద్వారా మద్దతు ధర కల్పించి.. కొనుగోళ్లపై రైతులకు పూర్తి భరోసా ఇవ్వాలన్నారు. ఉల్లి, టమాటా వంటి ఇతర ఉద్యానవన పంటల ధరల్లో వచ్చే ఒడిదుడుకుల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా, ధరల వ్యత్యాస నిధి కింద కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలని కోరారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనందున, కేంద్ర కూటమిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తన ప్రభావాన్ని ఉపయోగించి, రైతులకు జరిగే ప్రతి నష్టాన్ని కేంద్రమే భరించేలా గట్టిగా ఒత్తిడి తేవాలని షర్మిల స్పష్టం చేశారు.








