తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యరూపం ఇచ్చారు. హైదరాబాద్ లోని మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు. తెలంగాణ గడ్డపై జనసేనకు సంబంధించి ఇదే తొలి కార్యాలయం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంబురాలు చేసుకున్నారు.
నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హోమాలను పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఆపై పార్టీ ఆఫీసు ముందు జనసేన జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో జనసేన సత్తా ఏంటో చాటిచెప్పేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. అనంతరం కార్యాలయంలోని తన ఛాంబర్ కు వెళ్లి పార్టీ నేతలతో పవన్ ముచ్చటించారు. రాబోయే రోజుల్లో చేయబోయే ప్రజా పోరాటాలకు సిద్దంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పవన్ సూచించినట్లు తెలుస్తోంది.
HYDలో జనసేన ఆఫీస్ను ప్రారంభించిన పవన్
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా జనసేన కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ గడ్డపై పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల తెలంగాణ ఆవీర్భావ దినోత్సం రోజున పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. అయితే ఏపీ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? అన్న ప్రశ్నకు మాత్రం పవన్ స్పష్టమైన సమాధానాన్ని ఇవ్వలేదు.








