విశాఖలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభించడానికి సమయం దగ్గర పడుతోంది. దీంతో అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టు ప్రారంభంపై ఢిల్లీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. కాకపోతే జూలై 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖ టు భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేక సదుపాయాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు వ్యక్తమవుతున్నాయి. విమాన ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం-అపాటా చేసిన సూచనలపై జీఎంఆర్ సంస్థ రియాక్ట్ అయ్యింది.
విమాన ప్రయాణికులు కార్లపై భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్తే ట్రాఫిక్ జటిలం అవుతుందని తెలిపింది. విశాఖ సిటీలో పలుచోట్ల వెయిటింగ్ లాంజ్లు పెట్టాలని కోరింది. అందులో అన్నిరకాల సదుపాయాలు ఉండనున్నాయి. ఎయిర్పోర్టుకు సంబంధించి వెయిటింగ్ లాంజ్లు విశాఖ సిటీలో ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి.
ఎయిర్ ట్రావెలర్ కోసం సిటీలో ప్రత్యేకంగా వెయిటింగ్ లాంజ్లు,
తొలుత ఐదు లాంజ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. లాంజ్లకు అనుకూలంగా కంటైనర్లు జీఎంఆర్ సంస్థ ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. వీటికి అవసరమైన విద్యుత్, నీటి సౌకర్యం ఇతర సదుపాయాలు కల్పించనుంది జీవీఎంసీ. వాటిని సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉండనున్నాయి.
బస్టాపులకు కూతవేటులో ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ బస్సు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏసీ, టాయిలెట్, తాగునీరు వంటి సదుపాయాలు ఉంటాయి. విమాన ప్రయాణికులు వారికి సమీపంలో వెయిటింగ్ లాంజ్ల వద్దకు చేరుకుంటే చాలు. అక్కడి నుంచి ఈవీ బస్సుల్లో నేరుగా భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు.
విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడం, తక్కువ చార్జీతో చేరుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టు నుంచి సిటీకి 50 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రెడీ చేశారు అధికారులు. ఇప్పటికే 20 బస్సులు విశాఖ నగరానికి చేరుకున్నాయి. ట్రయిల్ రన్ నిర్వహించారు అధికారులు.
10 బస్సులు గాజువాక నుంచి ఆనందపురం మీదుగా భోగాపురం ఎయిర్పోర్టు వరకు తిరుగుతాయి. మరో 10 బస్సులు గాజువాక నుంచి సిటీలో ముఖ్యమైన ప్రాంతాల మీదుగా భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకుంటాయి. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టులో చెక్ ఇన్ కౌంటర్లు, లగేజీ స్కానింగ్ సంబంధించి ట్రయల్ రన్ జరుగుతోంది. ప్రారంభోత్సవ రోజున అంతర్జాతీయ సర్వీసులు పెట్టాలని ఎయిర్ ట్రావెలర్స్ కోరుతున్నారు.








