ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత నిరసనపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ట్వీట్ చేశారు.
చరిత్ర సృష్టించిన శాంతియుత నిరసన
విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో కలిసి చరిత్ర సృష్టించామని అభిజిత్ దీప్కే ప్రకటించారు. తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అసలు జీవితంలో ఎన్నడూ ఇలాంటి ధర్ణాల్లో పాల్గొనని వారు కూడా విద్యా వ్యవస్థపై ఉన్న కోపంతో మొదటిసారి రోడ్డుపైకి వచ్చారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ప్రభుత్వం ముందు మన గొంతు ఎంత బలంగా వినబడుతుందో చెప్పడానికి ఈ నిరసన ఒక చిన్న ‘ట్రైలర్’ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
రాజీలేని పోరాటం.. 7 రోజుల అల్టిమేటం!
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక పూర్తి తరం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని, వారికి తీవ్ర అన్యాయం చేశారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 7 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి పదవి నుంచి తొలగించకపోయినా, లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోకపోయినా తమ నిరసనలను క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
భవిష్యత్తు కార్యాచరణపై లైవ్
‘బొద్దింకల లాంటి సామాన్య ప్రజలమైన మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వానికి భయపడాల్సిన పనిలేదు’ అంటూ ధీమా వ్యక్తం చేసిన అభిజిత్, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన తదుపరి ప్రణాళికలు, భవిష్యత్తు కార్యాచరణను వివరించడానికి ఈ రోజు సాయంత్రం ఇన్స్టాగ్రామ్ (Instagram) లైవ్లోకి రానున్నట్లు ఆయన తన ట్వీట్లో వెల్లడించారు.








