తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మే 10 ఆదివారం రోజున ప్రధాని తెలంగాణకు రానున్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కవిత ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి సంబంధించిన నాలుగు ప్రధాన సమస్యలపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ అభ్యున్నతికి ఈ అంశాలు ఎంతో కీలకమని.. వీటిపై కేంద్రం సానుకూల వైఖరి ప్రదర్శించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు.
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) తక్షణమే ‘జాతీయ హోదా’ కల్పించాలని కవిత కోరారు. మహబూబ్నగర్.. రంగారెడ్డి.. నల్గొండ వంటి కరువు పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఒక జీవనాడి వంటిదని ఆమె పేర్కొన్నారు. సుమారు 12.31 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ భారీ ప్రాజెక్టును 90 శాతం కేంద్ర నిధులతో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. జాతీయ హోదా కల్పించడం ద్వారానే ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం జరుగుతుందని ఆమె ప్రధానికి వివరించారు.
బీసీ జనాభా గణనపై కూడా కవిత తన లేఖలో గట్టిగా గళం ఎత్తారు. దేశంలో వెనుకబడిన వర్గాల జనాభాపై కచ్చితమైన గణాంకాలు లేకపోవడం వల్ల అభివృద్ధి పథకాలు అందరికీ చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 2027 జనాభా లెక్కల్లో బీసీల కోసం ప్రత్యేక కాలమ్ను చేర్చాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా స్పష్టమైన గణాంకాలు ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని.. జనాభా గణనలో ఈ మార్పులు అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలనే అంశాన్ని ఆమె మరోసారి ప్రస్తావించారు. చట్టసభల్లో మహిళలకు కేటాయించే 33 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక స్థానం ఉండాలని కోరారు. అప్పుడే వెనుకబడిన వర్గాల మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు లభిస్తాయని.. ఈ సవరణ లేకుండా మహిళా రిజర్వేషన్లు అసంపూర్ణమేనని స్పష్టం చేశారు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా కేంద్రం చొరవ చూపాలని కోరారు.
తెలంగాణకు మేలు చేసే ఈ నాలుగు డిమాండ్లపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా దృష్టి సారించాలని కవిత సూచించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఈ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి ఒప్పించాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశారు. తెలంగాణ హక్కుల కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన వేళ కవిత రాసిన ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







