AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పీఓకేలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా రగులుతున్న నిరసన… భారత్‌తో కలుస్తామని హెచ్చరిక..

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్‌లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో తాము ఉండబోమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు.

 

ఈ ఆందోళనలో పాల్గొన్న పౌర హక్కుల కార్యకర్త సర్దార్ అమన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రభుత్వం ఆహారం, నిత్యావసరాలను అడ్డుకుంటే, తమ సరిహద్దులను భారత్ వైపు తెరుస్తామని ఆయన అన్నారు. అప్పుడు పీఓకేను తమతోనే ఉండమని ఇస్లామాబాదే వేడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

పాక్ ప్రభుత్వ అణచివేత, తీవ్రమైన ఆర్థిక కష్టాలు, ద్రవ్యోల్బణం, పాలనా వైఫల్యాలే ఈ నిరసనలకు ప్రధాన కారణాలని ఆందోళనకారులు తెలిపారు. సుమారు రెండు వారాలుగా ప్రభుత్వం ఆహార, సరఫరాల దిగ్బంధనం విధించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

నిరసనల సమాచారం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ 5 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు, నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో కూడా జూన్ 9 నుంచి మరో నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ ఆందోళనలకు విదేశాల్లోని పాకిస్థానీ రాయబార కార్యాలయాల వద్ద కశ్మీరీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ముజఫరాబాద్ సహా తమ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదని నిరసనకారులు తేల్చిచెప్పారు.

ANN TOP 10