AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సునీల్‌ మిట్టల్‌కు సీఎం రేవంత్‌ భేటీ..! డిజిటల్‌ రంగంలో పెట్టుబడులపై చర్చ..!

తెలంగాణలో డిజిటల్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భారతి ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని ఎయిర్‌టెల్‌ డిజిటల్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ రంగాల్లో కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు.

 

ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధీ పెవిలియన్‌లో రేవంత్‌ రెడ్డిని మంగళవారం సునీల్‌ భారతి మిట్టల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులకు అనుకూలంగా తీసుకొచ్చిన సంస్కరణలపై సీఎం వివరించారు.

 

రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్న సీఎం విద్యా రంగంలో చేపడుతున్న మార్పులను కూడా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

 

పారిశ్రామిక రంగ అవసరాలకు తగ్గట్టుగా యువతకు నైపుణ్యాలు అందించేందుకు ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ గురించి కూడా సునీల్‌ మిట్టల్‌కు వివరించారు. అలాగే ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) మారుస్తున్నట్లు తెలిపారు.

 

పాలిటెక్నిక్‌ కళాశాలలను కూడా ఆధునికీకరిస్తున్నామని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంకేతిక రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కూడా తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు.

ANN TOP 10