పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. నందిగ్రామ్, భవానీపూర్ నియోజకవర్గాల నుంచి భారీ విజయం సాధించిన బీజేపీ అగ్రనేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (PA) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రనాథ్ రథ్ తన నలుపు రంగు స్కార్పియో కారులో కూర్చుని ఉన్న సమయంలో మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. అత్యంత సమీపం నుంచి (Point-blank range) ఆయనపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సమాచారం అందుకున్న మధ్యమ్గ్రామ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తన అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యారని తెలియడంతో సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సువేందు అధికారి ముఖ్యమంత్రి పదవికి రేసులో అత్యంత ముందంజలో ఉన్నారు. మే 4న విడుదలైన ఫలితాల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు సాధించి చారిత్రాత్మక విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.








