జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వేణు ఎల్దండి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కమెడియన్ గా కొన్ని సినిమాలలో కూడా చేసిన ఈయన..దర్శకుడిగా సత్తా చాటారు. బలగం వంటి హృదయాన్ని తాకే ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రంతో ఏకంగా జాతీయస్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి ఈయన తన రెండవ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఎల్లమ్మ అనే ఒక ప్రత్యేకమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ పాత్రలో కొంతమంది హీరోల పేర్లను పరిశీలించినప్పటికీ.. కొంతమంది రిజెక్ట్ చేయడం వల్ల ఎట్టకేలకు సినిమా దేవి శ్రీ ప్రసాద్ వద్దకు చేరింది.
వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..
ఇకపోతే తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం దర్శకుడు చాలా జాగ్రత్తగా హీరోయిన్లను ఎంపిక చేయాలని భావించారు. అందులో భాగంగానే మొదట సాయి పల్లవి ను తీసుకోవాలని ప్రయత్నించారు. ఇదే విషయంపై ఈ పాత్ర కోసం ఆమెను సంప్రదించగా.. డేట్స్ సమస్యల కారణంగా ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు కూడా బలంగా వినిపించింది. ఒకానొక దశలో ఆమెను ఖాయం చేశారని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత శృతిహాసన్, రుక్మిణి వసంత్ వంటి కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీతారామం సినిమాతో సీత మహాలక్ష్మి పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ ను ఇందులో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇకపోతే భావోద్వేగ సన్నివేశాలలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని చిత్ర బృందం కూడా భావిస్తోంది.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన దేవి శ్రీ ప్రసాద్..
ఇక త్వరలోనే చిత్ర బృందం అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ “పార్శి”అనే ఒక శక్తివంతమైన పాత్రలో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ లో ఆయన లుక్ కి ఊహించని రెస్పాన్స్ లభించింది. పైగా ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తూ ఉండడం గమనార్హం . తెలంగాణ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక అంశాలు , జానపద కళలతో ముడిపడిన కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇటీవల గ్లింప్స్ లో చూపించిన వేప ఆకులు , కుంకుమ, పసుపు , గజ్జల శబ్దాలు సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . మొత్తానికైతే హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే షూటింగ్ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాబోతోంది. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మరి నిర్మాతల నమ్మకాన్ని వేణు ఏ విధంగా నిలబెడతారో చూడాలి . ఇకపోతే దేవిశ్రీప్రసాద్ సరసన మృణాల్ హీరోయిన్గా నటించబోతోంది అంటూ వార్తలు రావడంతో దేవి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు అనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.








