తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఎప్పుడూ శత్రువులగా ఉండే డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీలు తమ బద్ధ వైరాగ్యాన్ని పక్కన పెట్టి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
తలపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని అధికార పీఠానికి దూరంగా ఉంచడమే ఏకైక లక్ష్యంగా ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్య చర్చలు సాగుతున్నట్లు ‘ఇండియా టుడే’ తన కథనంలో వెల్లడించింది. ప్రస్తుత అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేల మద్దతును విజయ్కు ప్రకటించడంతో ఆయన బలం 112కి చేరింది. అయితే మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్కు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో విజయ్ బలాన్ని నిరూపించుకోకముందే.. 59 స్థానాలు గెలిచిన డీఎంకే, 47 స్థానాలు గెలిచిన అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు జరపడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీలు కలిస్తే వారి సంఖ్యాబలం 106కి చేరుతుంది. అయితే స్వతంత్రులు, చిన్న పార్టీలు లేదా లెఫ్ట్ పార్టీలను కలుపుకుని విజయ్కు చెక్ పెట్టాలని ద్రవిడ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా సిద్ధాంతపరంగా, వ్యక్తిగతంగా తలపడ్డ ఈ పార్టీలు.. విజయ్ రూపంలో ఒక కొత్త శక్తి ఉద్భవించడాన్ని తమ ఉనికికే ప్రమాదంగా భావిస్తున్నాయి. ఒకప్పుడు ఒకే చెట్టు నుంచి పుట్టిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం ఏకమవుతాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.








