AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లక్షలాది మంది పేద విద్యార్థులకు వరంగా మారిందని, కేసీఆర్ హయాంలో దీన్ని మరింత పటిష్టంగా అమలు చేశామని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

జీవన్ రెడ్డి డిమాండ్

 

బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయని, తద్వారా విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు. రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థులకే ఇస్తామనడం హాస్యాస్పదమని, ప్రభుత్వం వెంటనే జీవో 7ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 

విద్యా, వైద్య రంగాల నిర్లక్ష్యం

 

కేసీఆర్ పాలనలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, టీమ్స్ (TIMS) వంటివి ఏర్పాటు చేసి విద్యా, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారని ఆయన పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కేవలం హైడ్రా, ఫోర్త్ సిటీ మీద ఉన్న శ్రద్ధ పేద విద్యార్థుల చదువుపై లేదని మండిపడ్డారు. విద్య, వైద్యం ప్రాథమిక హక్కులని, వాటిని కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

 

నెరవేరని హామీలు – విఫలమైన డిక్లరేషన్లు

 

ఎన్నికల ముందు ఇచ్చిన రైతు భరోసా, రుణమాఫీ హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని జీవన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీని సాక్షిగా పెట్టి వరంగల్‌లో రైతు డిక్లరేషన్, అశోక్ నగర్‌లో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా.. అమలులో మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాలన్నారు, తీరా చూస్తే కేవలం 17 వేల ఉద్యోగాలతో సరిపెట్టారని విమర్శించారు. పది వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి 1994 నాటి పరిస్థితి పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ప్రజలంతా ‘రేవంత్ పోవాలి – కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10