తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బిగ్ టీవీ ఛానెల్తో మాట్లాడుతూ ఘాటైన కౌంటర్లు ఇచ్చారు. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని, అందుకే ప్రజలు ఆ పార్టీని ఇంటికి పంపించారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు..
ముఖ్యంగా కవిత కొత్త పార్టీ పెట్టిన ఉదంతంపై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘కవిత బయటకు వచ్చి పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు ఆమె బాధ ఏంటో తండ్రిగా కేసీఆర్ ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా?’ అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి పంపకాలు సజావుగా జరిగాయా లేదా ఆమెకు రావాల్సిన వాటా వచ్చిందా అనే కోణంలో కుటుంబ గొడవలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కవిత వేస్తున్న ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారని, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముక్కలవుతోందని విమర్శించారు. అయితే కవిత పార్టీ వల్ల కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదని, పైగా ఆమె పార్టీని స్వాగతిస్తున్నామని ఆయన ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్, ప్రాజెక్టుల అవినీతి..
ఫోన్ ట్యాపింగ్ ,ప్రాజెక్టుల అవినీతిపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ కమిషన్ విచారణ జరిపితే కేసీఆర్ చేసిన అరాచకాలు బయటపడతాయని, ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన సూత్రధారులు కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నారని ఆరోపించారు. తమపై ఉన్న నిందలను కప్పిపుచ్చుకోవడానికే హరీష్ రావు వంటి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై హ్యాకింగ్ ఆరోపణలు చేస్తున్నారని కొట్టి పారేశారు.
100 సీట్లు రావడం ఖాయం..
రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని, కేవలం కులం, మతం పేరుతో ఎల్లకాలం రాజకీయం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడానికి రైతు డిక్లరేషన్ సభలు పెడుతోందని, కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము 100 సీట్లకు పైగా గెలిచి మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలను టార్గెట్ చేస్తూ సాగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.








