హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో ఒక కీలక ఘట్టం పూర్తయింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరమైంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి వంద శాతం షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. రూ.1,461.47 కోట్ల విలువైన షేర్ల బదిలీ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ ప్రతినిధి డీకే సేన్, ఎల్ అండ్ టీ మెట్రోరైలు (హైదరాబాద్) లిమిటెడ్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు పూర్తి చేశారు.
మెట్రో స్వాధీన ప్రక్రియకు సంబంధించి గతంలోనే గడువు నిర్ణయించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. వాస్తవానికి మార్చి 31వ తేదీనే మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణం మంజూరు కావడంలో కొంత ఆలస్యం జరగడంతో ఈ గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. ఏప్రిల్ 29న షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తి కావడంతో.. నిర్దేశించిన గడువులోపే మెట్రో రైలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగా మారింది.
ఈ మార్పుతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు ఇకపై నేరుగా ప్రభుత్వం పర్యవేక్షణలో సాగనున్నాయి. మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్ల ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు మెట్రో సేవలు అందిస్తోంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మెట్రో రెండో దశ విస్తరణ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేసింది.








