మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన వంద మందికి పైగా ముదిరాజ్ నాయకులు కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి హరీశ్ రావు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక కులవృత్తులను పూర్తిగా గాలికొదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.1000 కోట్లు వెచ్చించి వలలు, మోపెడ్లు, త్రీ వీలర్ వాహనాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో 4 వేల కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి 4 లక్షల మందికి సభ్యత్వాలు ఇవ్వడంతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కోసం అప్పట్లో ఏటా రూ.850 కోట్లు ఖర్చు చేసేవారమని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల టెండర్లు ఆలస్యమై గత రెండేళ్లుగా చేప పిల్లల పంపిణీ నిలిచిపోయిందని హరీశ్ రావు విమర్శించారు. సకాలంలో చేప పిల్లలను చెరువుల్లో వదలకపోవడం వల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బతిందని మండిపడ్డారు. ముదిరాజ్ లను బీసీ ‘ఏ’ గ్రూపులో చేరుస్తామని, బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మబలికి మోసం చేసిందని దుయ్యబట్టారు. 42 శాతం రిజర్వేషన్ల హామీ సైతం నీటిమూటగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో కోకాపేటలో కులవృత్తుల ఆత్మగౌరవ భవనాల కోసం విలువైన స్థలాలు కేటాయించగా ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. నిధుల కొరతతో ఆ భవన నిర్మాణ పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయని ఆవేదన చెందారు. గొర్రెల పంపిణీ పథకాన్ని చేనేత కార్మికులకు ఇచ్చే రసాయనాల సబ్సిడీని కూడా ఈ సర్కార్ రద్దు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపు వస్తున్నారని ఇది మార్పుకు సంకేతమని అన్నారు.








