AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన.. గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్”కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై తన విజన్‌ను వివ‌రించారు. మనమందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆయన ఉద్ఘాటించారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన ఫ్యూచర్ సిటీని నిలబెట్టాలన్నదే ప్రభుత్వ దృఢ నిశ్చయమని ప్రకటించారు.

 

ఫ్యూచర్ సిటీ పరిధిని పెంచే విషయంలో స్థానిక ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తమ గ్రామాలను కూడా ఈ కమిషనరేట్ పరిధిలో కలపాలని కోరుతున్న వారి కోసం గ్రామసభలు నిర్వహించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ప్రజా తీర్మానాల మేరకు ఆయా గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 2వ తేదీలోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇక నుంచి ఇక్కడి నుంచే పారిశ్రామిక సమీక్షలు నిర్వహిస్తామని, పెట్టుబడులను ఆహ్వానిస్తామని వెల్లడించారు.

 

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి మాట్లాడుతూ.. గతంలో ఔటర్ రింగు రోడ్డు (ORR) నిర్మాణాన్ని కూడా చాలామంది విమర్శించారని, కానీ నేడు 160.500 కి.మీల విస్తీర్ణంతో అటువంటి అద్భుతమైన రహదారి దేశంలో ఏ నగరానికీ లేదని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో భూములు కోల్పోతున్న రైతుల పట్ల ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తుందని, ఎవరికీ నష్టం కలగకుండా ఆదుకునే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని రైతులకు ధైర్యం చెప్పారు.

 

రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని, దేశంలో మంజూరైన ఏడు బుల్లెట్ ట్రైన్లలో మూడు తెలంగాణకే రావడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెంగళూరు-హైదరాబాద్, శంషాబాద్-పూణే, శంషాబాద్-అమరావతి-చెన్నై మార్గాల్లో బుల్లెట్ ట్రైన్లకు మార్గం సుగమమైందని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో ఒక మహా అద్భుతం జరగబోతోందని, ప్రపంచ పెట్టుబడిదారులందరూ ఇక్కడికే వచ్చేలా నగరాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచాలని, అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తామని ప్రజలకు విన్నవించారు.

 

రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాము అభివృద్ధి చేస్తుంటే కొందరు ఏడుపులు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. పురాణాల్లో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, మారీచ సుబాహులను పంపి ఎలాగైతే భగ్నం చేసేవారో, ఇప్పుడు ఫామ్ హౌస్‌లో ఉన్న శుక్రాచార్యుడు కూడా మన అభివృద్ధిని అడ్డుకునేందుకు తన అనుచరులను పంపుతున్నారని సెటైర్ వేశారు. అటువంటి వారి మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, విమర్శలను పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

 

చివరగా ఈ వేదిక నుంచి మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక పిలుపునిచ్చారు. ఇంకా ఎవరైనా అడవుల్లో మిగిలిపోయిన మావోయిస్టులు ఉంటే, వారు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు సీఎం. లొంగిపోయి వచ్చే వారికి మెరుగైన ఆరోగ్యం, ఉపాధి మరియు జీవన భరోసా కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. శాంతియుత వాతావరణంలోనే అద్భుతమైన నగర నిర్మాణం సాధ్యమవుతుందన్నారు సీఎం.

ANN TOP 10