AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తోంది..-: కేటీఆర్..

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు సంవత్సరాల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికీ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో చేసిన ఆ కపట మోసాన్ని ప్రజలకు గుర్తు చేసేలా మే 6న వరంగల్‌లో రైతన్నలతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలు ఈ సమావేశానికి రావాలని కేటీఆర్‌ను ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు విత్తనాల కొరతతో పాటు ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారని రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు సక్రమంగా సాగడం లేదని నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపడతామని నేతలు వెల్లడించారు.

 

సంస్థాగత అంశాలపై స్పందిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కమిటీల ఏర్పాటుపై కీలక సూచనలు ఇచ్చారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు.

 

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి బూత్‌లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలదేనని స్పష్టం చేశారు. కొత్త ఓటర్లను నమోదు చేయించడంతో పాటు అర్హులైన ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ సహాయకుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా సవరణను అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని సూచించారు.

ANN TOP 10