హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రజతోత్సవ ముగింపు వేడుకలకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పార్టీ ముఖ్య నేతలు జీవన్ రెడ్డి మధుసూదనచారి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ప్రముఖులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు.
లోక్సభలో ప్రస్తుతం బీఆర్ఎస్ సభ్యులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నా సభలో ఎవరూ అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే అటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టి రణరంగం సృష్టించేవారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రయోజనాలపై సభలో నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తమ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి మరే ఇతర రాజకీయ పక్షానికి ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన క్రమంలో హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోసమే తాము గట్టిగా కొట్లాడి విజయం సాధించామని గుర్తుచేశారు.
గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు చేత ‘జై తెలంగాణ’ అనిపించేందుకే ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమం కోసం అశోక్ గులాటీ అనే మిత్రుడి సలహా మేరకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని విమర్శించారు. రైతు పండించిన ధాన్యం కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.
ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుత పాలన బొందల పడ్డట్టు అయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం హైదరాబాద్లోని భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చండాలమైన పాలనగా అభివర్ణించారు. నాయకుల మాటలు కూతలు చిల్లరగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.








