AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్ కేసుల్లో సెలేబ్రిటీలను పట్టుకుని జైల్లో పెట్టండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు..

హైదరాబాద్‌ పోలీసు విభాగం ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులకు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో మత్తు మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్, ఇతర వ్యసనాలు సమాజాన్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరిస్తూ, వీటిని నియంత్రించాల్సిన బాధ్యత పౌర సమాజంపై, ముఖ్యంగా నగర ప్రముఖులపై ఉందని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే సమాజానికి తీరని అన్యాయం చేసిన వారమవుతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలకు చెందిన వారిపై నిఘా గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేలాది మంది సామాన్యులపై కేసులు పెడితే రాని మార్పు, ఇద్దరు ప్రముఖ నేరగాళ్లను జైలుకు పంపితే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎంత పెద్ద సెలబ్రిటీ అయితే వారిని అంత వేగంగా పట్టుకుని ప్రజల మధ్య నిలబెట్టి శిక్షించాలి, అప్పుడే సమాజానికి బలమైన సందేశం వెళ్తుంది” అని అధికారులకు సూచించారు. నేరాలకు పాల్పడే ప్రముఖులను చెర్లపల్లి లేదా చంచల్‌గూడ జైలులో ఉంచి, కనీసం ఏడాది వరకు బయటకు రాకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

 

నేరగాళ్ల పట్ల ప్రభుత్వం అనుసరించే ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. “మీరు ఎంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, వ్యాపారవేత్తలైనా, ఉన్నతాధికారుల వారసులైనా సరే.. నేను ఎవరినీ వదిలిపెట్టను (I don’t spare anyone)” అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం ఎవరినీ వదలదు అనే భయం నేరగాళ్లలో ఉండాలని, బాధ్యత లేని వారిని భయపెట్టయినా సరే దారిలోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భయం, బాధ్యత లేనప్పుడే సమాజంలో విచ్చలవిడితనం పెరుగుతుందని, అటువంటి ధోరణులను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.

 

పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ వల్ల నిర్వీర్యం అయిపోయిందని, తెలంగాణలో అటువంటి పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు. స్కూళ్ల వద్ద గంజాయి విక్రయించే వారిపై, మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహిళల మీద జరిగే దాడులకు ప్రధాన కారణం మత్తు వ్యసనాలేనని ముఖ్యమంత్రి విశ్లేషించారు. డ్రగ్స్ బానిసల వల్ల మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతోందని, అందుకే వీటిని నియంత్రించడం అత్యవసరమని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్పందన’ (Spandana), ‘స్టాండ్ విత్ హర్’ (Stand With Her), ‘షీ టీమ్స్’ (She Teams) వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో మహిళలకు కొండంత అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళల రక్షణకు ప్రతిరూపంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10