AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని రీతిలో భారీ షాక్..! కేజ్రీవాల్‌ను బోల్తా కొట్టించిన ఎంపీలు..!

అసమ్మతి ఎంపీలను బుజ్జగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతుండగానే, ఆయనకు ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. పార్టీపై గుర్రుగా ఉన్న ఎంపీలతో సమావేశమై, వారిని శాంతింపజేయాలని ఆయన వేసిన ప్రణాళిక కార్యరూపం దాల్చక ముందే, ఏడుగురు కీలక రాజ్యసభ సభ్యులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్నారు. ఈ నాటకీయ పరిణామం జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

ఆయన పిలిచేలోపే.. వారు వెళ్లిపోయారు!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పార్టీలో అసమ్మతి పెరుగుతోందని గ్రహించిన కేజ్రీవాల్.. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో కీలక ఎంపీలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వారిని బుజ్జగించి, అవసరమైతే ప్రస్తుతానికి రాజీనామా చేయాలని, తదుపరి టర్మ్‌లో మళ్లీ అవకాశమిస్తానని హామీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, కేజ్రీవాల్ వ్యూహాన్ని పసిగట్టిన అసమ్మతి వర్గం ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. గురువారమే పార్టీని వీడాలని రహస్యంగా నిర్ణయించుకుని, శుక్రవారం ఉదయమే బీజేపీ అగ్రనేతలతో మంతనాలు జరిపి, కేజ్రీవాల్ సమావేశానికి కొన్ని గంటల ముందే తమ రాజీనామా నిర్ణయాన్ని బహిరంగపరిచారు. ఈ పరిణామంతో ఆప్ నాయకత్వం పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది.

 

సిద్ధాంతాలు మరిచారంటూ చద్దా విమర్శ

బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ ఆప్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ఒకప్పుడు మేమంతా రక్తమాంసాలు ధారపోసి నిర్మించుకున్న పార్టీ ఇది. కానీ, నేడు ఆప్ తన మూల సిద్ధాంతాలను, విలువలను పూర్తిగా విస్మరించింది. అందుకే మేం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండేందుకే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మంది సభ్యులుగా (10 మందిలో 7) తాము విలీన నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించిన పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేశామని చద్దా స్పష్టం చేశారు. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, సందీప్ పాఠక్ వంటి ప్రముఖులు పార్టీ వీడిన వారిలో ఉన్నారు.

 

‘ఆపరేషన్ లోటస్’ అని ఆప్ ఎదురుదాడి

ఈ అనూహ్య పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది బీజేపీ కుట్రపూరితంగా అమలు చేసిన “ఆపరేషన్ లోటస్” అని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. “పంజాబ్‌లో మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేకే బీజేపీ ఈ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. మా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది,” అని ఆయన మండిపడ్డారు.

 

మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏకంగా ఏడుగురు పార్టీని వీడటంతో, 14 ఏళ్ల ఆప్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సంక్షోభంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామం పంజాబ్ ప్రభుత్వంపైనా, పార్టీ భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ANN TOP 10