తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు రూ.25-28 పెరుగుతాయని ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పందించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు భారీగా పెరుగుతాయన్న నివేదికలను ఖండించింది. ఎక్స్ వేదికగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ‘పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడానికి ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదు’ అని పేర్కొంది. అటువంటి నకిలీ వార్తలను నమ్మొద్దని సూచించింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు?
అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులతో.. ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో రిఫైనరీలపై భారం పడుతుంది. ఈ నష్టాలను నివేదిస్తూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఒక సంస్థ రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా పలు జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. ప్రభుత్వం ఇంధన ధరల పెంపు ప్రతిపాదనను పరిశీలించడంలేదని స్పష్టం చేసింది.
ఇలాంటి వార్తా కథనాలు ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు, ఉద్దేశపూర్వకంగా రాసినవి అంటూ కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ.. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, చమురు ప్రభుత్వ రంగ సంస్థలు ధరలను నియంత్రిస్తున్నట్లు పేర్కొంది. గత నాలుగేళ్లుగా దేశంలో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని స్పష్టం చేసింది.
పెరుగుతున్న ముడి చమురు ధరలు
ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర సుమారు 120 డాలర్లకు పెరిగింది. ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్త ముడిసరుకు వ్యయాలకు, దేశీయ రిటైల్ ధరలకు మధ్య పెరుగుతున్న అంతరంపై ఆందోళనలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
రిఫైనరీలపై ఒత్తిడి
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అనే బ్రోకరేజ్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని దీంతో ఎన్నికల తర్వాత ధరలు పెంచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పెరిగిన ముడి చమురు ధరల నేపథ్యంలో రిఫైనరీలపై ఒత్తిడి పెరుగుతుండడంతో, ఇంధన ధరలు లీటరుకు రూ. 25-28 వరకు పెరగవచ్చని ఈ రిపోర్ట్ లో అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగిన రిటైల్ ఇంధన ధరలను పెంచకపోవడంతో.. ప్రభుత్వ రంగ రిఫైనరీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నష్టాలను భర్తీ చేయడానికి ధరలు పెంపు తప్పనిసరి అని నివేదికల అందుతున్నట్లు తెలుస్తోంది.
ధరల ఒత్తిళ్లు
గతంలో ధరల ఒత్తిళ్లను నియంత్రించడానికి ఎక్సైజ్ సుంకాల తగ్గింపు, ఎక్స్ ఫోర్ట్స్ పై చర్యలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ధరల స్థిరత్వానికే కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో ముడి చమురు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి, ఇంధన ధరల పెంపు లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్రం తెలిపింది.








