AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్‌ చూస్తారు: పప్పు యాదవ్‌..

ఎంపీ పప్పూ యాదవ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం చల్లారకముందే, బుధవారం ఆయన మరో సంచలన ఆరోపణ చేశారు. దేశంలోని 70 నుంచి 80 శాతం మంది రాజకీయ నాయకులు పోర్న్ (అశ్లీల చిత్రాలు) చూస్తారని, తన ఫోన్‌తో సహా అందరి ఫోన్లను తనిఖీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

వివాదం నేపథ్యం ఇదే

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ.. “రాజకీయాల్లోకి రావాలంటే 90 శాతం మంది మహిళలు ఎవరో ఒక పురుష నేత గదిలోకి వెళ్లాల్సిందే” అంటూ పప్పూ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై బిహార్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

 

ఈ నోటీసులపై స్పందిస్తూ పప్పూ యాదవ్ మరింత ఘాటుగా బదులిచ్చారు. “70-80 శాతం మంది రాజకీయ నాయకులు పోర్న్ చూస్తారని నేను సభలో కూడా చెప్పాను. అందరినీ తనిఖీ చేయండి. నా ఫోన్‌లో పోర్న్ ఉంటే నన్ను కూడా చెక్ చేయండి. నాకు నోటీసులు ఇవ్వడానికి వీళ్లెవరు? వీళ్లు ఎవరితో ఉన్నారు?” అని ఆయన ప్రశ్నించారు. అంతేగాక‌ మహిళా కమిషన్ సభ్యురాలు సజల్ పలువురు నేతలతో ఉన్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడతానని హెచ్చరించారు.

 

వ్యాఖ్యల సమర్థన

తాను మహిళల పక్షానే పోరాడుతున్నానని, పురుష రాజకీయ నాయకులు మహిళలను వాడుకోకుండా రాజకీయాల్లోకి రానివ్వరని తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. “దేశవ్యాప్తంగా 755 మంది పురుష రాజకీయ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. 155 మందిపై చార్జ్‌షీట్లు కూడా దాఖలయ్యాయి. నేను పురుష నేతల గురించి మాట్లాడితే మహిళా కమిషన్‌కు ఎందుకు అంత బాధ? ఈ నేతలు మహిళలను దోపిడీ చేస్తూనే మహిళా రిజర్వేషన్ చట్టం గురించి మాట్లాడతారు” అని ఆయన ఆరోపించారు.

 

ఈ వ్యాఖ్యలపై ఆయనకు మద్దతిస్తున్న కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా తీవ్రంగా స్పందించి, ఆయన వైఖరిని ఖండించాయి. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల మెజారిటీ రాకుండా విఫలమైన నేపథ్యంలో పప్పూ యాదవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ANN TOP 10