AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీపై ‘ఉగ్రవాది’ వ్యాఖ్య.. ఖర్గేకు ఈసీ నోటీసులు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించారన్న ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఖర్గేకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా, రాజకీయ గౌరవాన్ని దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

బుధవారం కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌తో కూడిన ఉన్నత స్థాయి బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసి ఖర్గే వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసింది. ప్రధానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు విషం చిమ్మే వ్యాఖ్యలు చేశారని, రాజకీయాల్లో హద్దులు మీరేవారికి ఒక హెచ్చరికగా నిలిచేలా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ప్రధానిపై ఖర్గే వాడిన భాష పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహంతో, విచారంతో ఉందని తెలిపారు. “ప్రధాని మోదీని ‘ఉగ్రవాది’ అని పిలవడం కేవలం ఒక వ్యాఖ్య కాదు, ఇది యావత్ దేశాన్ని అవమానించడమే. ఇలాంటి నీచమైన ప్రవర్తనను సహించలేం” అని ఆయన స్పష్టం చేశారు.

 

వివాదం నేపథ్యం.. ఖర్గే వివరణ

మంగళవారం చెన్నైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో, ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఖర్గే ప్రధానిని ఉద్దేశించి ‘ఉగ్రవాది’ అనే పదాన్ని ఉపయోగించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే, తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ఆయన తర్వాత వివరణ ఇచ్చారు.

 

“నేను మోదీని ఉగ్రవాది అని అనలేదు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెడుతున్నారనే ఉద్దేశంతో ఆ మాట అన్నాను” అని ఖర్గే స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దేశంలో భయానక వాతావరణం నెలకొందని విమర్శించే క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ, ఖర్గే క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల స్థాయిని దిగజార్చుతోందని ఆరోపించారు.

ANN TOP 10