AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పు..! ఇకపై కొత్త రూల్..

తెలంగాణలో ఆసరా పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ‘ముఖ గుర్తింపు’ (ఫేషియల్ రికగ్నిషన్) విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

 

ఈ కొత్త విధానం అమలుపై ప్రజాభవన్‌లో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు అధికారులకు ఈ విధానంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఇక్కడ శిక్షణ పొందిన అధికారులు తమ జిల్లాల్లోని సిబ్బందికి శిక్షణ ఇచ్చి, క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తారని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సీఈవో దివ్యాదేవరాజన్‌ తెలిపారు.

 

గతంలో పింఛన్ల పంపిణీ సమయంలో వృద్ధుల వేలిముద్రలు ఫింగర్‌ప్రింట్ స్కానర్లలో సరిగా నమోదు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. దీనికితోడు, చనిపోయిన లబ్ధిదారుల పేర్లతో కొందరు అక్రమంగా డబ్బులు స్వాహా చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల లబ్ధిదారులు వేలిముద్రలతో పనిలేకుండా, యాప్ ద్వారా సులభంగా తమ గుర్తింపును నమోదు చేసి పింఛన్ తీసుకోవచ్చు.

 

ఈ కొత్త టెక్నాలజీతో లబ్ధిదారుడు జీవించి ఉన్నాడా లేదా, వలస వెళ్లాడా అనే విషయాలు సులభంగా తెలిసిపోతాయి. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోని వారిని గుర్తించడం, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం వంటివి వేగంగా జరుగుతాయి. తద్వారా అనర్హులను ఏరివేసి, కేవలం అర్హులకే ప్రభుత్వ లబ్ధి అందేలా చూడటమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశం. జిల్లాల్లో సిబ్బంది శిక్షణ పూర్తయిన వెంటనే నగర, పట్టణ ప్రాంతాల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది.

ANN TOP 10