AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక: డిసెంబర్ 17 నుంచి సుప్రభాత సేవ రద్దు – కారణం ‘ధనుర్మాస ఉత్సవాలు’

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్యమైన సూచన చేసింది. ప్రతి సంవత్సరం ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 1:23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై ఉత్సవాలు నిర్వహిస్తారు.

ధనుర్మాసం ఉత్సవాలను తిరుమల శ్రీవారి ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ నెల రోజులు శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు, ఇందులో భాగంగా బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. అలాగే, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి విశేష నైవేద్యాలను కూడా నివేదిస్తారు.

పురాణాల ప్రకారం, ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును దర్శించుకుంటారని చెబుతారు. ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 12 మంది ఆళ్వార్లలో ఒకరైన శ్రీ ఆండాళ్ (గోదాదేవి) రచించిన 30 పాశురాలనే తిరుప్పావై అంటారు. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు ఏకాంతంగా నివేదిస్తారు. ఈ సమయంలో భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ చేస్తారు.

ANN TOP 10