భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన పేరు, ఫొటోలను సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ వేదికలపై అక్రమంగా వినియోగిస్తున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ కంటెంట్ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశిస్తూ, గవాస్కర్కు న్యాయస్థానం ఊరట కల్పించింది. ఈ పిటిషన్ను అధికారిక ఫిర్యాదుగా పరిగణించి, ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్న కంటెంట్ను తక్షణమే తొలగించాలని సంబంధిత సంస్థలను కోర్టు ఆదేశించింది.
జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ విచారణ చేపట్టిన ఈ కేసులో, ఆన్లైన్ అభ్యంతరకర కంటెంట్పై చర్యలు కోరేవారు ముందుగా ఐటీ నిబంధనల ప్రకారం ఫిర్యాదుల యంత్రాంగాన్ని సంప్రదించాలని, ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. గవాస్కర్ పిటిషన్ను ఫిర్యాదుగా స్వీకరించి, వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని మధ్యవర్తులుగా ఉన్న ప్రతివాదులను ఆదేశించింది. ఉల్లంఘనలకు సంబంధించిన యూఆర్ఎల్లను 48 గంటల్లోగా సమర్పించాలని పిటిషనర్కు సూచిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది.
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తొలి భారత క్రికెటర్గా సునీల్ గవాస్కర్ నిలిచారు. ఈ తరహా వివాదాలు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, నాగార్జున, అనిల్ కపూర్ వంటి సినీ ప్రముఖులకు పరిమితమైనా, ఇప్పుడు క్రీడా రంగానికి కూడా విస్తరించడం గమనార్హం. అయితే, ఈ రక్షణ తీర్పులు వ్యంగ్యం, కళాత్మక స్వేచ్ఛ, వార్తా కథనాలకు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది.









