ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన ‘నర దిష్టి’ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా, మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు. “ఒంటరిగా గెలిచే సత్తా లేని వ్యక్తి పవన్ కళ్యాణ్” అని వ్యాఖ్యానించిన శ్రీనివాస్ గౌడ్, సొంత బలంతో గెలవలేక కమ్మ, కాపు సామాజిక వర్గాలను ఏకం చేసి, సినిమాలోలా చివరిలో చంద్రబాబు వచ్చి కాపాడితే గెలిచి ఉప ముఖ్యమంత్రిగా మారావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆవేశమే తప్ప, అర్ధం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారా? అంటూ ఆయన మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి కూడా ఇదే వివాదంపై స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ తక్షణమే తన మాటలపై బాధ్యత తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్న పవన్ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఒక వ్యాఖ్య ఇంతటి రాజకీయ దుమారానికి దారితీయడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం బీఆర్ఎస్కే కాకుండా, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల్లోనూ చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్ దీనిపై క్షమాపణ చెబుతారా, లేక రాజకీయ పోరును మరింత ముదురుస్తారా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠగా మారింది.









