తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లు తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్తో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లో మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన బృందంతో కలిసి ఆడనున్నారు. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచడంతో పాటు, యువతను ఫుట్బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మ్యాచ్లో మెస్సీ తన ట్రేడ్మార్క్ 10వ నంబర్ జెర్సీతో ఆడనుండగా, సీఎం రేవంత్ రెడ్డి 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో “సూపర్ సీఎం” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








