పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదలైన పది రోజుల్లోనే ఈ చిత్రం 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై రూ.303 కోట్ల గ్రాస్ సాధించిన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డును ‘ఓజీ’ అధిగమించింది.
ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో కటానా పట్టుకొని పవన్ స్టైలిష్గా నడుస్తున్న ఈ పోస్టర్కు “అలలిక కదలక భయపడేలే… ప్రళయం ఎదురుగా నిలబడేలే” అనే వ్యాఖ్యను జోడించింది. ఈ ప్రకటనతో ‘ఓజీ’ రూ.303 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే, చిత్రబృందం ఈసారి కలెక్షన్ల సంఖ్యతో కూడిన పోస్టర్ను విడుదల చేయకపోవడం గమనార్హం.
విడుదలైన తొలి రోజు రూ.154 కోట్లు, నాలుగు రోజుల్లో రూ.252 కోట్లు సాధించినట్లు అధికారిక పోస్టర్ల ద్వారా ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు కేవలం రికార్డు బ్రేక్ చేసినట్లు చెప్పి సైలెంట్గా ఉండటం నెటిజన్లలో చర్చకు దారితీసింది. సినిమాకు ఉన్న అంచనాలకు, బ్లాక్బస్టర్ టాక్కు అనుగుణంగా వసూళ్ల వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, సినిమాపై ఉన్న భారీ హైప్కు, పది రోజుల్లో వచ్చిన వసూళ్లకు మధ్య కొంత వ్యత్యాసం కనిపిస్తోందని సినీ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి. ఏదేమైనా, ‘ఓజీ’ ఈ ఏడాది టాలీవుడ్లో కొత్త బాక్సాఫీస్ బెంచ్మార్క్ను సృష్టించినప్పటికీ, దాని అసలు వసూళ్లపై నెలకొన్న సందిగ్ధత కొనసాగుతోం
ది.