ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ ఏడాది జిల్లాలో 15 వేల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పంటను విస్తరించడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం ఆయన పెదవేగిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రాన్ని (ఐఐఓపీఆర్) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు, ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రాసెసర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయిల్ ఫామ్ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రధానంగా చర్చించారు. అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు, కోకో వంటి అంతర పంటల సాగుపై అవగాహన, డెల్టా భూముల్లో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడం, వరి, పొగాకు వంటి సంప్రదాయ పంటల నుంచి ఆయిల్ ఫామ్ వైపు పంటల వైవిధ్యీకరణ, ఆయిల్ ఫామ్ సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెదవేగిలోని ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నతమైన స్థానంలో ఉందని ప్రశంసించారు. ఈ కేంద్రం ద్వారా అనేక మంది రైతులకు, ఆయిల్ ఫామ్ ప్రాసెసర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. సుమారు 29 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పనిచేస్తున్నారని, 250 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి మౌలిక సదుపాయాలతో ఆయిల్ ఫామ్ పంట పరిశోధన, టిష్యూకల్చర్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. రైతులకు అధిక దిగుబడులు అందించే ప్రక్రియలను, వివిధ పరిశోధనల గురించి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కంచర్ల సురేష్ లోతుగా వివరించారని మంత్రి తెలిపారు.
ప్రధానంగా ఐదు కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో ఆయిల్ ఫామ్ పంట సాగుపై సుదీర్ఘంగా చర్చించామని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టి సారించామని అన్నారు. అభివృద్ధిలో జిల్లాను ప్రస్తుతమున్న 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. జీడీపీ వృద్ధికి ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ పంటను మరింత విస్తరించాలని, రైతులను ప్రోత్సహించే విషయంపై ముఖ్యమంత్రి సమక్షంలో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాన్ని 5 వేల హెక్టార్ల నుంచి 15 వేల హెక్టార్లకు పెంచినట్లు ప్రకటించారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆయిల్ ఫామ్ పంట సాగులో ఉన్న సమస్యలను వివరించారని, డెల్టా ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి తెలిపారు. పంటసాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో, క్షేత్రస్థాయిలో వాస్తవ సమాచారం పంచుకోవడంలో కొంత జాప్యం జరుగుతోందని గుర్తించామన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రైతు సహాయ కేంద్రాల సిబ్బంది, హార్టికల్చర్ ఫీల్డ్ విస్తరణాధికారులు, ఐదు ప్రధాన కంపెనీల ప్రతినిధులకు పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం సహకారంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రతినెలా సమావేశమై సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పురుగుల నివారణకు వాడాల్సిన ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిందని, అలాగే ఆయిల్ ప్రొడ్యూసర్లను కూడా మోసం చేసి సుమారు రూ. 54 కోట్లు బకాయిలు పెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం తరఫున ఎంతవరకు ఆదుకోగలమో పరిశీలిస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆధునిక వ్యవసాయ పరికరాలు, రైతులు కష్టపడి తెచ్చుకున్న మొక్కలకు సంబంధించి అందించాల్సిన సబ్సిడీలో ఎటువంటి జాప్యం లేకుండా నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తే డెల్టా ప్రాంతంలో కూడా ఆయిల్ ఫామ్ సాగును విస్తరించుకోవచ్చని, ఇతర జిల్లాల్లోని రైతులను కూడా ప్రోత్సహించడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. 2027 వరకు ఉన్న జాతీయ ఆయిల్ మిషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ సాగులో దేశంలో సింహభాగంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడీలను, ప్రోత్సాహక విధానాలను అందిపుచ్చుకుని మన ప్రాంతంలో మెరుగైన ఆయిల్ ఫామ్ సాగును తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలోని పెదపాడు తదితర డెల్టా ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని మంత్రిని కోరారు. ఈ ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు మంచి డిమాండ్ ఉందని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.