యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘పాప్కార్న్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి, తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త, ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగులో ‘అఖండ-2’, ‘స్వయంభు’ వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ, తాజాగా మరో క్రేజీ ఆఫర్ను అందుకుంది.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలయికలో రాబోతున్న ఓ భారీ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా వెల్లడించింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ స్వయంగా సంయుక్తకు స్వాగతం పలుకుతూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. “ఆమె అడుగులో దయ, కళ్ళలో ఫైర్ ఉంది” అనే ఆసక్తికరమైన వ్యాఖ్యను ఆ పోస్ట్కు జోడించి, సినిమాపై అంచనాలను మరింత పెంచారు.
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు, సినీ వర్గాల్లో దీనిపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఒకప్పటి హీరోయిన్ చార్మీ కౌర్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు, విలక్షణ నటి రాధికా ఆప్టే కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. కాగా, ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.