తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారన్న కారణంతో కేటీఆర్ ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పేర్లు ఈ కేసులో వినిపిస్తున్నాయి. మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎంతోమంది ఫోన్లను ట్యాప్ చేశారని, సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.