సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తనివ్వమని ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక మర్రి చెట్టు అని నువ్వు గంజాయి మొక్క అంటూ రేవంత్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి తనను రాక్షసుడు అంటున్నాడని, ప్రజల కోసం తాను రాక్షసుడినేనని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్న రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశపడ్డామని కానీ ఏమీ చేయలేదని పేర్కొన్నారు.
అబద్ధాలు ఆడి, ప్రమాణాలు చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని ఆయన తెలంగాణ ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. నిన్న సీఎం సభకు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే హాజరు కాలేదని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నీ సభకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే రేవంత్ మాత్రం తప్పించుకుపోయాడని వ్యాఖ్యలు చేశారు.