యూనివర్సిటీలపైన నమ్మకం కలిగించేలా పని చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డితో యూనివర్సిటీల నూతన వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో ఇవాళ(శనివారం) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. కొంత కాలంగా యూనివర్సిటీలపైన నమ్మకం తగ్గుతోందని..యూనివర్సిటీల గౌరవాన్ని పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని చెప్పారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకుని నివేదిక తయారు చేసుకోవాలని కోరారు. వైస్ ఛాన్స్లర్లకు ఎవరి ప్రభావితంతో పోస్ట్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్స్లర్లను ఎంపిక చేశామని గుర్తుచేశారు. బాగా పని చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచిగా పని చేయడానికి వైస్ ఛాన్స్లర్లకు స్వేచ్ఛ ఉంటుందని… ప్రభుత్వ సహకారం ఉంటుందని మాటిచ్చారు. యూనివర్సిటీలను వందశాతం ప్రక్షాళన చేయాలని అన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవారని..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని అన్నారు. విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలని వైస్ ఛాన్స్లర్లకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.