తెలంగాణలో రాగల రెండు, మూడురోజులు వానలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ములుగు, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది. ఈ నెల 4 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో మంచిర్యాల, ములుగు, జయశంకర్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డితో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది.