AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డీఎస్‌ భౌతికకాయానికి సీఎం రేవంత్‌ నివాళులు

పూలమాల ఉంచి శ్రద్ధాంజలి
కుటుంబసభ్యులకు ఓదార్పు
డీఎస్‌ మరణం తీరనిలోటు
ఆయన చివరి కోరిక తీర్చాం.. సీఎం

(అమ్మన్యూస్, నిజామాబాద్‌):
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు డీ శ్రీనివాస్‌ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్‌లోని డీఎస్‌ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్‌.. ఆయన పార్థీవదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి.. డీఎస్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీకి డీఎస్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త డీఎస్‌ అని పేర్కొన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన డీఎస్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్‌ చొరవ చాలా ఉందన్నారు. సోనియా గాంధీని ఒప్పించడంలో కీలకంగా పని చేశారని సీఎం చెప్పారు. ఆలోచన విధానం, పనితీరు బాగుండడంతోనే రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమించారన్నారు. సోనియా గాంధీ స్వయంగా శ్రీను హౌ ఆర్‌ యూ అని పలకరించే వారన్నారు.

ఆయన కోరిక నెరవేర్చాం..
డీఎస్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని అనుకుంటున్నట్లు తనను అడిగారని సీఎం రేవంత్‌ తెలిపారు. ఎలాంటి పదవుల ఆశ లేదని, తన చివరి ఘడియల్లో పార్టీ జెండా తన దేహంపై ఉండాలని అన్నారని గుర్తు చేశారు. ఆ మేరకు నివాళులు అర్పించామని.. డీఎస్‌ చివరి కోరిక తీర్చామన్నారు సీఎం రేవంత్‌. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టామని తెలిపారు. డీఎస్‌ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విశ్వాసపాత్రుడైన డీఎస్‌ను కోల్పోవడం కాంగ్రేస్‌కు తీరని లోటన్నారు. రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా తన సానుభూతి తెలిపారని చెప్పారు. డీఎస్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎలాంటి స్మృతి కార్యక్రమాలు చేయాలో నిర్ణయిస్తామన్నారు. డీఎస్‌కు నివాళులు అర్పించిన అనంతరం సీఎం రేవంత్‌ తిరిగి హైదరాబాద్‌ బయలుదేరారు.

ANN TOP 10