న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆ పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో భేటీ అయిన షర్మిల.. రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణకు సంబంధించి చర్చలు జరిపారు.
ఈ భేటీలో ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని వైఎస్ షర్మిల తన ఎక్స్(ట్విట్టర్)ఖాతాలో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ ఒక బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ షర్మిల విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, అటు పార్లమెంట్ ఎన్నికల్లో గానీ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. అయితే, గతంలో కంటే తమకు ఓటు శాతం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఏపీలో కొలువుదీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు.









