AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముమ్మాటికీ రాజకీయ కక్షే.. జస్టిస్‌ నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ లేఖ

– కమిషన్‌ బాధ్యల నుంచి వైదొలగాల్సిందే..
– విద్యుత్‌ కొనుగోలులో నిబంధనలు పాటించాం..
– చట్టానికి లోబడే పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామంటూ స్పష్టీకరణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
విద్యుత్‌ కొనుగోలు, పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ వెళ్లామని చెప్పారు. ఈఆర్‌సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్‌ చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్‌ కొనుగోలు విషయంలో జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. ఈమేరకు కమిషన్‌కు 12 పేజీల లేఖ రాశారు.

‘రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్‌ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. అన్ని రకాల అనుమతులు పొంది మందుకు పురోగమించడం జరిగింది. రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికే కమిషన్‌ వేశారు. మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మా మార్పును తక్కువ చూపించేందుకే రేవంత్‌ ప్రభుత్వ ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు.

పత్రికా విలేకరుల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందన్నారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గుతేల్చాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. ఇప్పటికే నష్టం జరిగినట్లు.. ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా’ అంటూ కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

ANN TOP 10