తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. దీంతో ఏపీలో రుతుపవనాలు మరింత విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నట్లు తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే మొదట జూన్ 4,5 తేదీల్లో రుతుపవనాలు ఏపీ లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ రెండు రోజులు ముందుగానే ఏపీ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇది ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి ఊతం ఇవ్వగలదని, రైతులకు గుడ్ న్యూస్ అని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.









