– గన్పార్క్లో అమరులకు సీఎం రేవంత్ నివాళులు
– పరేడ్ గ్రౌండ్లో పతాకావిష్కరణ
– ‘జయ జయహే తెలంగాణ’.. రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల çస్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరయ్యారు. అక్కడ జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ కవి అందెశ్రీ రచించారు.
సోనియా శుభాకాంక్షలు..
అనంతరం కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చడం తక్షణ కర్తవ్యంగా తాము భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ వెనుకడుగు వేయదని సోనియా తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.









