ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మోడీ నాయకత్వంలోనీ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ప్రశంసించారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్, విమానాశ్రయాలు, టెక్స్టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు విస్తరించాలని కోరినట్లుగా తెలిపారు. మెట్రో విస్తరణపై ప్రతిపాదనలు పంపేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందుకు ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీకి ఇచ్చని వినతి పత్రంలో పేర్కొన్నారు. అంతే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టును ఘట్కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని ప్రధాని మోదీని కోరారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రిని సైతం పలుమార్లు కలిసి విన్నవించినట్లుగా తెలిపారు.
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నందున వారి కోసం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలన్నారు. నూతన టెక్నాలజీతో కూడిన అసో మిషన్స్ కూడా భువనగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కోసం మంజూరు చేయాలని అన్నారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని విన్నవించారు.