కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. మంగళవారం (ఏప్రిల్16) రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టును 2 వికెట్ల తేడాతో ఓడించింది రాజస్థాన్ రాయల్స్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. సునీల్ నరైన్ శతకంలో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జోస్ బట్లర్ మెరుపు సెంచరీ (60 బంతుల్లో 107 నాటౌట్, 9ఫోర్లు, 6 సిక్సర్లు) చేయడంతో పాటు చివరి వరకు క్రీజులో ఉండి తన జట్టును గెలిపించాడు. రియాన్ పరాగ్ ( 14 బంతుల్లో 34), పావెల్ (26; 13 బంతుల్లో) దూకుడుగా ఆడి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, వరుణ్ 2, నరైన్ 2, వైభవ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.









