ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండురోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్సనందించారు. దురదృష్టావశాత్తు చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు.
తెలుగులో తొలిసారి వార్తలు..
శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. తెలుగు తొలి న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారు. అంతేకాదు.. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. శాంతిస్వరూప్.. 1983 నవంబర్ నుంచి దూరదర్శన్లో వార్తలు చదివారు. 2011లో దూరదర్శన్లో పని చేసిన ఆయన.. ఆ తరువాత పదవీ విరమణ చేశారు. న్యూస్ రీడర్గా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా శాంతిస్వరూప్ అందుకున్నారు.
తొలి తరం న్యూస్ రీడర్గా తెలుగు ప్రజలు అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. 1983 నుంచి న్యూస్ రీడర్గా శాంతి స్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారని రేవంత్ కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని రేవంత్ పేర్కొన్నారు.









