AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌

ఢిల్లీ మ‌ద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి తొమ్మిది గంట‌ల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసినా ఆయ‌న హాజ‌రు కాలేదు. ఒక కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తొలి రాజకీయ నేత అరవింద్ కేజ్రీవాల్ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్.

ఈ కేసులో ఇప్పటి వరకూ ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తదితరులను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ను రెండున్నర గంటల పాటు ఆయన నివాసంలోనే ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా, ఆయన జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని ఢిల్లీ మంత్రి అతిషి చెప్పారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినందున స్థానిక న్యాయస్థానం ముందు హాజరు పరిచి రాత్రికి ఈడీ కార్యాలయానికి ఆయనను తరలించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినా ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాలు లభించలేదని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో 600 మందికి పైగా అరెస్ట్ చేశారన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముంగిట కేజ్రీవాల్ గొంతు నొక్కివేయడానికే ఆయనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని అన్నారు.

ANN TOP 10