AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీడబ్ల్యూసీ కీలక సమావేశం 19న.. ఎజెండా ఏమిటంటే..?

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls) నగారా మోగడంతో కీలకమైన ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto)కు కాంగ్రెస్ (Congress) పార్టీ తుది మెరుగులు దిద్దుతోంది. ఈనెల 19న జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో మేనిఫెస్టోకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు ఇదే చివరి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది.

సీడబ్ల్యూసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపడమే ప్రధాన ఎజెండాగా ఉంది. ఇప్పటికే పలు ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పేద మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం, ప్రస్తుతం రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని పెంచేందుకు రాజ్యంగ సవరణ చేయడం, 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, ఈనెల 19న జరిగే సీడబ్య్సూ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించడం, వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల షేరింగ్‌పై కుదిరిన ఒప్పందాలకు ఆమోదముద్ర వేయడం జరుగుతుంది. గత సీడబ్ల్యూసీ సమావేశం డిసెంబర్ 21న జరిగింది. భాగస్వామ్య పార్టీలతో సీట్ల షేరింగ్‌కు సంసిద్ధం కావాలని, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పేరుతో మరో యాత్ర నిర్వహించాలని ఆ సమావేశంలో తీర్మానించారు.

ANN TOP 10