AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్..!

ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ రైజింగ్ లో ఉంది. ఎల్ నినో ఎఫెక్ట్ తో వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం లోపించడం, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం, వ్యవసాయ రంగం పూర్తిగా విద్యుత్ ఆధారిత సాగు వైపు మళ్లడం వంటి పరిణామాలతో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీడీసీఎల్ నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి మోటార్ల వినియోగాన్ని పెంచడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ కండీషనర్లు, కూలింగ్ పరికరాల వినియోగం అధికమవడం, పారిశ్రామిక, ఐటీ రంగాల విస్తరణతో విద్యుత్ అవసరాలు మరింత పెరిగాయి.

విద్యుత్ వినియోగం పెరగడంతతో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఈనెల 12న 10,839 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 7,216 మెగావాట్లు నమోదైంది. గతేడాదితో పోలిస్తే దాదాపు 3,623 మెగావాట్ల అధిక డిమాండ్ నమోదవ్వడం గమనార్హం. అలాగే విద్యుత్ వినియోగం ఈసారి 207.30 మిలియన్ యూనిట్లకు చేరగా, గతేడాది 147.12 మిలియన్ యూనిట్ల వినయోగం జరిగింది. గతంతో పోలిస్తే 60.18 మిలియన్ యూనిట్ల అదనపు వినియోగం నమోదైంది. అదేవిధంగా క్యూర్ పరిధిలో ఈనెల 12న 3,920 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదుకాగా, గతేడది ఇదే రోజున నమోదైన 3,310 మెగావాట్లతో పోలిస్తే 610 మెగావాట్ల పెరుగుదల నమోదైంది. విద్యుత్ వినియోగం 81.17 మిలియన్ యూనిట్లకు చేరగా, గతేడాది 65.49 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 15.68 మిలియన్ యూనిట్ల అదనపు వినియోగం నమోదైంది.

రైతులు, గృహ వినియోగదారులు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీజీఎస్పీడీసీఎల్ వెల్లడించింది. విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, అదనపు లోడ్‌ను భరించేలా సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లను బలోపేతం చేయడం, అత్యవసర స్పందన బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచడం, కీలక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టడం ద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు పేర్కొంది.

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ, రైతులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందించేందుకు కట్టుబడి ఉందని ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ డిమాండ్ ప్రతి వారం కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నప్పటికీ, సమర్థ ప్రణాళిక, ఆధునిక సాంకేతికత వినియోగం, సిబ్బంది అంకితభావంతో సరఫరాను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.

ANN TOP 10