ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ED)అధికారులు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పై పోలీస్ కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసేందుకు తాము ఆమె నివాసానికి వెళ్లిన సమయంలో కేటీఆర్ దౌర్జన్యం చేశారని ఈడీ అధికారులు కంప్లైట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈడీ అధికారులు.
మరోవైపు కవిత అరెస్ట్ చేసిన సమయంలో ఈడీ అధికారి భానుప్రియ మీనా(Bhanupriya meena)తో పాటు మరికొందరు అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ విధులకు అడ్డుతగిలారనే ఈడీ అధికారులు కేటీఆర్ పై కేసు పెట్టాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. బీజేపీనే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ శ్రేణుల నిరసనల నేపధ్యంలో హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. మరోవైపు కవిత అరెస్ట్ ని నిరసిస్తూ బీఆర్ఎస్ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.









