AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్టు.. జితేందర్‌రెడ్డి ఇంటికి రేవంత్‌

కాంగ్రెస్‌లోకి బీజేపీ కీలక నేత!
బీజేపీకి బిగ్‌ షాక్‌
ఇంటికి వెళ్లి అరగంటకుపైగా భేటీ అయిన సీఎం
సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ
త్వరలో హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం

(అమ్మన్యూస్‌ ప్రతినిధి, హైదరాబాద్‌)
నిజంగా బీజేపీకి బిగ్‌ బిగ్‌ షాక్‌.. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో బిగ్‌ పొలిటికల్‌ ట్విస్టు చోటు చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.

గతంలో జితేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ లో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ లోక్‌ సభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఆయనకు సీటు కేటాయించలేదు. దీంతో జితేందర్‌ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్‌ నగర్‌ సీటును జితేందర్‌ రెడ్డి ఆశించారు. అయితే మహబూబ్‌ నగర్‌ ఎంపీ స్థానాన్ని బీజేపీ అధిష్టానం తాజాగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో జితేందర్‌ రెడ్డికి నిరాశ ఎదురైంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ మహబూబ్‌ నగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డికి, బీఆర్‌ఎస్‌ మన్నె శ్రీనివాసరెడ్డికి సీట్లు ప్రకటించాయి. దీంతో మూడు పార్టీల మధ్య సంకుల సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ రెడ్డికి ఇంటికి వెళ్లారు, ఈ సందర్భంగా ఆయనతో భేటీ అయ్యారు. జితేందర్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌ సీటను బీజేపీ అధిష్టానం ఇవ్వకపోవడం, ఇదే సమయంలో రేవంత్‌ ఆయన ఇంటికి వెళ్లడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు.

బీజేపీలోనే ఉన్నా..
ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్‌ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదన్నారు. తన అన్న ఇంటికి వచ్చాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిది, తనది ఒక్కటే జిల్లా అని గుర్తు చేశారు. తనకు సీటు రాలేదని ఓదార్చడానికే సీఎం రేవంత్‌ వచ్చాడని తెలిపారు. తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని జితేందర్‌ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీలో సంతోషంగానే ఉన్నానన్నారు. తన సీటు గురించి బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. కాగా జితేందర్‌ రెడ్డి 1999లో బీజేపీ తరఫున మహబూబ్‌ నగర్‌ లో గెలుపొందారు. తిరిగి మళ్లీ 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీగా విజయం సాధించారు.

ANN TOP 10