ఫోన్ ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావుకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు పంజాగుట్ట పోలీసులు. ఫోన్ ట్యాపింగ్, రికార్డుల ధ్వంసం కేసులో రిమాండ్ విధించారు నాంపల్లి కోర్టు జడ్జి. విచారణ అనంతరం మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని జడ్జి నివాసంలో ప్రణీత్రావుని పంజాగుట్ట పోలీసులు అండ్ ఏసీపీ ప్రవేశపెట్టారు. ప్రణీత్రావు కేసు విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటై.. డీసీపీ నేతృత్వంలో రహస్యంగా విచారణ చేశారు. ప్రణీత్ రావు స్టేట్ మెంట్ రికార్డ్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
విచారణలో ప్రణీత్రావుపై ప్రశ్నల వర్షం కురిపించి ఆయనకు సహకరించిన అధికారుల పాత్రపై ఆరా తీశారు. ప్రణీత్ రావు దగ్గర నుంచి ఇప్పటికే సెల్ఫోన్లను సీజ్ చేశారు. పదిలక్షల కాల్ డేటాను తొలగించినట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం సెల్ఫోన్లను FSLకు పంపించారు. సెల్ఫోన్ డేటా ఆధారంగా మరికొందరి పాత్ర బయటపడే అవకాశముంది.. ప్రణీత్రావు అరెస్ట్తో పలువురు మాజీ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది..ప్రణీత్రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని విచారించే అవకాశం కూడా ఉంది.
ప్రముఖుల ప్రొఫైల్స్ మానిటర్ చేశారన్న డీసీపీ విజయ్ కుమార్..
ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్రావు వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు అరెస్టుపై డీసీపీ విజయ్ కుమార్ స్పందించారు. విచారణలో ప్రణీత్రావు నేరం అంగీకరించారని తెలిపారు. ప్రణీత్రావు పాటు మరికొందరు కలిసి ఎస్ఐబి ఆఫీసులో ఉన్న డేటా ధ్వంసం చేశారని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రహస్యంగా పలువురు ప్రముఖుల ప్రొఫైల్స్ను మానిటర్ చేశారని తెలిపారు డీసీపీ. ప్రణీత్రావుతో పాటు మరికొందరు కుట్రపూరితంగా వ్యవహరించారని.. కొంతమందితో కలిసి రికార్డ్స్ లో ఉన్న డేటాను తన పర్సనల్ డ్రైవ్లో కాపీ చేసుకున్నారని చెప్పారు. తర్వాత కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లతో పాటు ఎస్ఐబిలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. తనతోపాటు మరికొందరి లబ్ది కోసమే ప్రణీత్ డేటా ధ్వంసం చేశాడని వెల్లడించారు డీసీపీ. ప్రణీత్ స్టేట్మెంట్ ద్వారా రిటైర్డ్ ఆఫీసర్ని విచారించబోతున్నారు పోలీసులు.