పాడి ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు ఒక సంపద లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, పాలు ఉన్న చోటే సంపద ఉంటుందన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో పాడి ఉత్పత్తి ఒక భాగమని, పాలు పొంగించి శుభాలు పొందుతారని పాలు ఉన్న చోట సంపద ఉంటుందని తెలిపారు. తెలంగాణలో పాడి ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని, ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడుతుందని వెల్లడించారు. మహిళలకు పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సాహిస్తున్నామని, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో దేశంలో హరిత, శ్వేత విప్లవానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. వ్యవసాయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ఈ వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.









